హైదరాబాద్ లో భూముల విలువను పెంచబోతున్నాం: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- శాస్త్రీయ పద్ధతిలో భూముల మార్కెట్ విలువను సవరించబోతున్నామన్న పొంగులేటి
- కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువ కనీసం రూ. 15 లక్షల వరకు పెరిగే అవకాశం
- రింగ్ రోడ్డు పరిధిలోని ప్రాంతాలు ప్రామాణికంగా ధరల పెంపు
తెలంగాణలో భూముల మార్కెట్ విలువ (రిజిస్ట్రేషన్ ధరల) పెంపుదలపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో త్వరలోనే శాస్త్రీయ పద్ధతిలో భూముల మార్కెట్ విలువను సవరించబోతున్నామని వెల్లడించారు. హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో భూముల విలువ భారీగా పెరిగే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ముఖ్యంగా ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని ప్రాంతాలను ప్రామాణికంగా తీసుకుని ఈ ధరల పెంపు ఉంటుందని వివరించారు. ఈ శాస్త్రీయ సవరణల వల్ల కొన్ని ప్రాంతాలలో మార్కెట్ విలువ కనీసం రూ. 15 లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
గత ప్రభుత్వం ఆర్థికవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యం కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా గతంలో రెండు సార్లు భూముల విలువను పెంచిందని మంత్రి గుర్తుచేశారు. అయితే, చివరిగా 2022 ఫిబ్రవరిలో భూముల మార్కెట్ విలువను సవరించారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.